Published On Aug 2, 2024
16, 17 శతాబ్దాలలో మధురను రాజధానిగా చేసుకొని తమిళనాడులో కొంత ప్రాంతాన్ని నాయకరాజులు పరిపాలించారు. ఈ నాయకరాజులు తెలుగువాళ్ళే. శ్రీకృష్ణదేవరాయలకు సామంతులు. పూర్వం తమిళప్రాంతంలో చోళరాజ్యం, పాండ్యరాజ్యం అని రెండు రాజ్యాలుండేవి. చోళరాజ్యానికి తంజావూరు, పాండ్యరాజ్యానికి మధుర రాజధానులు. మధుర వైగై నదీతీరంలో ఉండేది. ఆ తరువాత కాలంలో ఈ రెండు రాజ్యాలు కూడా విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యాలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడైన విశ్వనాథనాయకుడిని పాండ్యదేశం అంతటికీ ప్రభువుగా నియమించాడు. ఆనాటి నుండే పాండ్యరాజ్యాన్ని మధుర నాయక రాజ్యమని పిలవడం మొదలుపెట్టారు. ఇదంతా 1529 నాటి మాట. తిరుచ్చిరాపల్లి, తిరునల్వేలి, శ్రీరంగం, రామేశ్వరం, కోయంబత్తూర్, కన్యాకుమారి మొదలైన ప్రాంతాలన్నీ మధుర రాజ్యంలోనే ఉండేవి. అయితే అప్పటికే సముద్రతీర గ్రామాల్లో చాలావరకూ పోర్చుగీసువారి అజమాయిషీలో ఉండేవి. ఈ పోర్చుగీసువాళ్ళని మన తెలుగువాళ్ళంతా బుడత కీచులు అనేవారు. తమిళవాళ్లేమో ఫరంగులు అనేవాళ్ళు. మనదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కూడా ఆ కాలంలోనే మెల్లమెల్లగా మొదలయ్యింది. ఇక విశ్వనాథ నాయకుడికి నాలుగవ తరంవాడు ముద్దు కృష్ణప్ప నాయకుడు. ఇతడు మధురను 1601 -1610 మధ్యకాలంలో పరిపాలించాడు. ఈ ముద్దు కృష్ణప్ప నాయకుడు కాలంలోనే రాబర్ట్ డీ నోబిలీ అనే క్రైస్తవ మత ప్రచారకుడు మధురకు వచ్చాడు. ఇతగాడిది ఇటలీ దేశం. మన భారతదేశంలో ఈనాడు క్రైస్తవం ఇంతల్లా వ్యాప్తించిందంటే అందుకు ఆ నోబిలీ నక్క తెలివితేటలే కారణం. అతనికి ముందు కూడా చాలమంది మతప్రచారకులు భారతదేశానికి వచ్చారు. కానీ వాళ్లెవ్వరూ కూడా మనవారిపై అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. దానితో ఈ నోబిలీ భారతీయుల్ని మభ్యపెట్టడానికి ఓ కొత్త ఎత్తు ఎత్తాడు. ముందుగా సంస్కృతం, తమిళం, తెలుగు నేర్చుకున్నాడు. కాషాయం కట్టాడు. గుండు చేయించుకున్నాడు. జంద్యం వేశాడు. తాను రోమ్ నగరానికి చెందిన బ్రాహ్మణుణ్ణంటూ తత్త్వబోధక స్వామిగా పేరు మార్చుకున్నాడు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ, మనందరివీ ఒకటే ఆచారాలంటూ, ఆ ముసుగులో క్రైస్తవాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అలా భారతదేశంలో క్రైస్తవమత వ్యాప్తికి బీజం వేశాడు. హిందూ ఆచారాల ముసుగులో క్రైస్తవ మత ప్రచారం అనే అతడి విధానాన్ని ఇప్పటికీ కొందరు మత ప్రచారకులు ఆయుధంగా వాడుకుంటున్నారు.. ఇదంతా మనం చెప్పుకోబోయే ఏకవీర నవలకు పూర్వరంగం. చారిత్రక కాలానికి సంబంధించిన నవల కనుక ఇదంతా చెప్పవలసి వచ్చింది.
ఇక ఈ ఏకవీర నవల ముద్దుకృష్ణప్ప నాయకుని కాలంలో జరిగిన కథగా మన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు కల్పన చేశారు. విశ్వనాథవారు తెలుగు రచయితల్లో హిమాలయం వంటివారు. ఆయన ప్రతి రచనలోనూ ధర్మం, చరిత్ర, ప్రాచీన సాహిత్యం, లలిత కళలు, ఉపాసనా రహస్యాలు, ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర పరిజ్ఞానం ఇలా ఎన్నో విషయాలుంటాయి. ఒకపక్క అసలు కథను చిత్రమైన రీతిలో, సరళ సుందరంగా నడుపుతూనే, మరోప్రక్క
ఈ విషయాలన్నింటినీ ఆ కథలో సందర్భనుసారంగా గుప్పించడం ఆయన శైలిలో ఉన్న విశేషం. ఇది ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఏకవీర నవలలో కూడా విశ్వనాథవారు తన ప్రతిభనంతా చూపించారు. ముందుగా మనం ఏకవీర కథను సంగ్రహంగా చెప్పుకుని ఆపై అందులో ఉన్న విశేషాలను చెప్పుకుందాం.
#viswanatha #Viswanadha #Ekaveera