Published On Jul 15, 2024
జనసేన పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సత్కారంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన సాధించిన విజయం రాజకీయ నిఫుణులకు, రాజనీతి శాస్త్ర విభాగంలో ఒక కేస్ స్టడీ అయ్యింది. జాతీయ స్థాయిలో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అమితంగా గౌరవించడానికి జనసేన విజయం ఎంతో దోహదపడుతుంది. ఇటీవల శ్రీ ముకేష్ అంబానీ గారి కుమారుడి వివాహానికి వెళ్లిన సమయంలోనూ అక్కడి అతిధులు జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ విజయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఎలా సాధ్యమని అడగడం గొప్పగా అనిపించింది. ఇది ఐదు కోట్ల ఆంధ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకం అని మనం గుర్తించాలి. ప్రజలు ఇచ్చిన ఈ విజయం ఓ గురుతర బాధ్యత అని మరువద్దు. ఆ నమ్మకాన్ని నెరవేర్చాలి’ అని ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఐదేళ్ల కిందట పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంతదూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదనీ, మరొకరైతే పార్టీని అప్పుడే వదిలేసేవారన్నారు. గత పాలక పక్షానికి ఇప్పుడు 11 సీట్లు రాగానే అసెంబ్లీకే రాకుండా ఉండిపోయారు... అంటే ఓటమిని తట్టుకోవడం అంత సులభం కాదు అని చెప్పారు. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం జనసేన పార్టీ సాగించిన పోరాట ప్రయాణం ఇంత దూరం నడిపించిందన్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికయిన లోక్ సభ సభ్యులకు, శాసన సభ, శాసన మండలి సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ సత్కారం చేశారు
ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ సీట్లను పరిమితం చేసుకుని ఎన్నికల బరిలో దిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మనం తీసుకున్న 21 సీట్లు 175లో తక్కువే కావచ్చు. కానీ కూటమి 164 చోట్ల విజయ దుంధుబి మోగించడంలో ఆ 21 సీట్లే వెన్నెముక అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ప్రజలు జనసేన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఎక్కడా ఓట్లు చీలకుండా కూటమికి ప్రజలంతా అండగా నిలబడిన తీరు జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గెలిచిన తీరు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చగలిగింది.
• అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు
గత వైసీపీ పాలనలో ప్రజలంతా భయం గుప్పెట్లో బతికారు. కోట్లాది మంది ప్రజలు మార్పు కోసం ఆశగా ఎదురుచూశారు. రోడ్డు మీదకు రావాలంటే భయం. అభిప్రాయం తెలియచేయాలంటే భయం. కనీసం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. బూతులు, బెధిరింపులు, కేసులు, వ్యక్తిగత దూషణలు గత ప్రభుత్వంలో నిత్యకృత్యం అయిపోయాయి. సాక్షాతూ ప్రజల చేత ఎన్నికయిన ఎంపీని బంధించి భౌతికంగా హింసించిన తీరు అందరికీ తెలిసిందే. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజుల పాటు జైల్లో పెట్టించిన తీరు కూడా అవగతమే. గత ప్రభుత్వ దాష్టికాలను బలంగా ఎదురొడ్డి నిలిచింది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. జనసైనికులు, వీర మహిళలు తప్పు జరిగిన ప్రతి చోటా రోడ్ల మీదకు వచ్చి పోరాడిన తీరు ఐదు కోట్ల మంది ప్రజలకు బలం అయ్యింది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నో పోరాటాలు, ఎంతో కష్టం, శ్రమ పడిన జనసైనికులకు, నాయకులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. జనసేన పోటీ చేయని చోట కూడా బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలా సహకరించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
• జనం కోసం సొంత కుటుంబాన్నే పక్కన పెడతాను
పార్టీని పటిష్టం చేయడానికి ఎవరి స్థాయిలో వారు బలంగా పని చేయాలి. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో జనవాణి నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించి వారి సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజల కష్టాలు తెలుస్తాయి. వాటిని తీర్చేందుకు ఏం చేయాలో తెలుస్తుంది. జనసేన పార్టీ నుంచి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగం చేస్తే సహించను. అధికారులతో కూడా చాలా హుందాగా మాట్లాడాలి. ఇంట్లో కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేయనీయొద్దు. వారసత్వ రాజకీయాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు గాని, నాయకుల కుటుంబ సభ్యులను సహజ ధోరణిలో రాజకీయాల్లోకి తీసుకురావాలి తప్పితే జనం మీద రుద్ది వారిని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం నేను సహించను. మన నాయకుల్ని మనమే ఇష్టానుసారం సోషల్ మీడియాలో తిడితే వారు నాకు విధేయులైనా, అమితంగా ఇష్టపడే వారైనా వారిని వదులుకోవడానికి సిద్ధం. ముఖ్యంగా మహిళా నేతలను ఎవరైనా కించపర్చినట్టు మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. రాజకీయాలను సంస్కరించాలి అని వచ్చిన మనమే సంస్కార హీనులుగా మారకూడదు. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ప్రజలు మనల్ని ఎంతో నమ్మి ఇచ్చిన విజయాన్ని దుర్వినియోగం చేయొద్దు. నేను లేకపోతే పార్టీ లేదు అనుకునే తత్వం వీడాలి. ఎవరు లేకపోయినా జనసేన పార్టీ ప్రయాణం ఆగిపోదు.
• రెండు అనాధ శరణాలయాలకు కూరగాయలు, రూ. లక్ష చొప్పున విరాళం ఆత్మీయ సత్కారంలో ప్రజా ప్రతినిధులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కూరగాయలతో చేసిన గుచ్చాలను అందచేశారు. అలాగే పార్టీ తరఫున ఎన్నికయిన ప్రజా ప్రతినిధులంతా కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడిగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందచేసిన కూరగాయల గుచ్చాలను రెండు అనాథ శరణాలయాలకు విరాళంగా అందించారు. ఈ కూరగాయల గుచ్చాల వల్ల బిడ్డలకు కడుపు నిండుతుందని, తనను ఎవరు కలవడానికి వచ్చినా ఇలాంటి పనికి వచ్చే బహుమతులే తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కూరగాయల గుచ్చాలను ఇచ్చి మిమ్మల్ని పంపలేనని అనాధ శరణాలయాల నిర్వాహకులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున విరాళం అందచేశారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఎస్.కె.సి.బి. ఆర్ఫనేజ్ హోమ్, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ లకు ఈ విరాళాలు అందించారు.
#JanaSenaParty #PawanKalyan #PawanKalyanAneNenu #100%Strikerate #JanaSena #leaders #deputycmpawankalyan #jsp