Published On Jun 6, 2023
పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణం ఒక ద్విపద కావ్యం. ద్విపద అనేది మన తెలుగులో ఓ ఛందోరీతి. ఈ ద్విపద పద్యానికీ రెండే పాదాలుంటాయి. పాడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరుమోసిన ముగ్గురు కవులలో ఒకడు. మిగిలిన ఇద్దరూ నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే కావ్యాలు సోమనాథుని తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాయి. ఈ కవి మన తెలంగాణాలో వరంగల్లుకు సమీపంలో ఉండే పాల్కురికి అనే గ్రామంలో పుట్టాడు. సోమనాథుడు తెలుగులోనే కాదు కన్నడ, సంస్కృతాలలో కూడా రచనలు చేసిన మహాకవి.
ఇక బసవపురాణం విషయానికి వస్తే.. ఇందులో బసవేశ్వరుని చరిత్రతో పాటూ బెజ్జమహాదేవి, కన్నప్ప, సిరియాళుడు మొదలైన ఎందరో శివభక్తుల కథలున్నాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు. ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్దికాలానికే పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అందుకే బసవపురాణంలో విషయాలు అసలు చరిత్రకు చాలా దగ్గరగా ఉండవచ్చన్నది పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి మాట. ఇక కథలోకి వెళదాం.
#basavapuraana #basaveshwara #lordshivastatus