Published On Oct 10, 2024
అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం
సంక్రాంతి వరకు భక్తులకు కొనసాగిస్తాం
శ్రీ ధర్మశాస్త్రా ఆధ్యాత్మిక సంస్థ ధర్మకర్తలు వెల్లడి
రాజమహేంద్రవరం, అక్టోబర్ 10:
స్థానిక గౌతమ ఘాట్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో విజయదశమి నుంచి అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు శ్రీ ధర్మశాస్త్రా ఆధ్యాత్మిక సంస్థ ధర్మకర్తలు జక్కంపూడి విజయ లక్ష్మి,చల్లా శంకరరావు, పొలసానపల్లిహనుమంత రావు, చెప్పారు. అయ్యప్ప మాల ధరించిన వారికే కాకుండా భవాని మాల,శివమాల ధరించిన భక్తులకు కూడా భోజనం అందిస్తామన్నారు. ప్రతియేటా మాదిరిగానే అన్నదాన కార్యక్రమం సంక్రాంతి వరకు కొనసాగుతుందని తెలిపారు.
రాజమహేంద్రవరం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జక్కంపూడి విజయ లక్ష్మి మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు సంస్థాపకులుగా నిర్మించిన అయ్యప్ప ఆలయం 2011మార్చి 10వ తేదీన ప్రారంభమైందని గుర్తుచేసారు.ఆ ఏడాది నుంచి ఆయన సంకల్పంతో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఆయన ఆశయాల మేరకు ధర్మకర్తలు కొనసాగిస్తు న్నారని తెలిపారు.
ఈ ఆలయం అందరిదీ అనే భావనతో ఎన్నో ఇబ్బందులను సైతం అధిగమించి నిర్వహణ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.అయ్యప్ప భక్తుల మాలధారణ సీజన్ నాలుగు నెలలే కావడంతో సీజనల్ టెంపుల్ గా ఉందని, అయితే అన్ని రోజులూ సందడిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
మాలధారణ చేసేవారికి శివాలయం ఇక్కడ లేదని తెలుసుకుని వాయులింగాన్ని ప్రతిష్ట చేశామని తెలిపారు.మేథా దక్షిణామూర్తి,లక్ష్మీ హయగ్రీవ,సువర్చలా ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. అలాగే మన్యం ఎలక్ట్రికల్స్ వారి కోరిక మేరకు వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా నిర్మించు కోడానికి ధర్మకర్తలు అంగీకారం తెలిపారని విజయలక్ష్మి చెప్పారు.మణికంఠునికి ఊయల కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా చల్లా శంకరరావు మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామమోహనరావు సంకల్పంతో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమంలో ప్రతియేటా భక్తులకు చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ప్రతిరోజూ రెండువేల నుంచి మూడు వేలమంది భోజనం చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది లక్షా 40వేలమందికి భోజనం అందించగా ఈ ఏడాది కూడా అదే అంచనాకు చేరుకుంటామని తెలిపారు.దాతలు విరివిగా సహకారం అందిస్తున్నారని శంకరరావు చెప్పారు.కోటి 15లక్షల రూపాయల విరాళాలల ను డిపాజిట్ చేశామని,ఈవిధంగా నిధి ఏర్పాటుచేయడం వలన భవిష్యత్తులో దానిపై వచ్చే వడ్డీతో అన్నదానం కొనసాగించవచ్చని ఆయన చెప్పారు.
పొలసానపల్లి హనుమంతరావు మాట్లాడుతూ జక్కంపూడి రామమోహనరావు సంకల్పంతో ప్రారంభించిన అన్నదానం ప్రతియేటా కొనసాగిస్తున్నామన్నారు.
చాపరాల రామచంద్ర రావు పేరిట రూ 65వేలు విరాళం అందజేత
అయ్యప్ప ఆలయంలో జరిగే అన్నదానం కోసం లక్ష్మీ సాయినాధ్ ఎంటర్ ప్రైజెస్ అధినేత చాపరాల రామచంద్రరావు పేరిట ఆయన ధర్మపత్ని సరస్వతి, కుమారుడు జగదీశ్, కోడలు శ్రీక్రాంతి, మనవరాలు సంయుక్త 65వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. వారిని ధర్మకర్తలు అభినందించారు. మంతెన కేశవరాజు, తోట సుబ్బారావు, ఇమంది మోహనరావు, దవులూరి రామకృష్ణ,చలపతి గురుస్వామి,పడాల శ్రీనివాస్, సూరంపూడి శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.