Published On Premiered May 24, 2024
వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహా భారతకథను సూతుడు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరుణ వలన ఆమెకు కళ్ళకు గంతలు ఉన్నా యుద్ధ భూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాలకళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారధులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒక చోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్ళు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంత మంది శరీరాలు గుర్తించ వీలు లేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు, అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి. తోడేళ్ళు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి.